హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానించాలని సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన తీర్మానాన్ని గౌరవించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే నిధుల్లో కోత విధిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి హామీపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం మంత్రి హరీశ్రావు కేంద్రానికి లేఖ రాశారు.
ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిరుడు రూ.30 వేల కోట్ల కోత విధించారని, దీంతో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గాయని తెలిపారు. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257 ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ ఒక్కో కూలీకి రూ. వంద మించడం లేదని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలేదని మండిపడ్డారు. గ్రామీణ అటవీ ప్రాంతాల్లో సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో ఉపాధి హామీ వివరాలు ఆన్లైన్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. సన్న, చిన్నకారు రైతులు ఎకువగా ఉన్న గ్రామీ ణ ప్రాంతాల్లో కూలీలుగా వారే ఉంటున్నారని, వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానిస్తే రైతులకు గిట్టుబాటు కూలీ లభిస్తుందని తెలిపారు. ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లు, కనీసం 100 పనిదినాలు కల్పించాలని కోరారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఏపీవోల వరకు అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.