సూర్యాపేట : రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అంశం(Electrical factor) పై ఇంకా కాంగ్రెస్ నాయకులు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సూర్యాపేటలో మీడియా సమావేశంలో ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. కర్ణాటకలో కాంగ్రెస్ 5గంటలే విద్యుత్ ఇస్తుందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు చేస్తున్నారు.
కుమారస్వామి వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ పార్టీ బండారం బయటపడిందన్నారు. కాంగ్రెస్ పనితనం కావాలంటే కర్ణాటకలో 18 గంటలు విద్యుత్ వైర్లు పట్టుకుని నిలబడతాను. తెలంగాణలో మీరు సిద్ధమా..ధైర్యం ఉంటే తెలంగాణలో కరెంట్ తీగలు పట్టుకుని కాంగ్రెస్ నేతలు ఓట్లడగాలని సవాల్ విసిరారు. కరెంట్ తీగలు పట్టుకుంటే కాంగ్రెస్ నేతలకు నిజాలు తెలుస్తాయన్నారు.
ఓట్ల పేరుతో గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలన్నారు. ముందు కరెంట్ తీగలు పట్టుకున్నాకే ఓట్లడగమని డిమాండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ వచ్చాకే గ్రామాలు పచ్చగా మారాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే చీకట్లు, కరువు తప్పదు. పోయిన కాంగ్రెస్ని మళ్లీ రానీయకుండా ఊరి బయట నుంచే తరిమికొట్టాలన్నారు.