సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీ అంటేనే కోతలు, వాతలు. వారుపాలించే ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా రైతులకి నాణ్యమైన 24 గంటలు కరెంటు అందించిన దాఖలానే లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన రైతు సమావేశానికి హాజరై మాట్లాడారు. దేశాన్ని 70 సంవత్సరాలు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏలిన రాష్ట్రాల్లో ప్రస్తుతం కూడా కరెంటు చూడని గ్రామాలు ఎన్నో ఉన్నాయి.
ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రానికి మించిన విద్యుత్ తయారీ అవుతున్నా కానీ అక్కడ రైతులకు నేటి వరకు కూడా 24 గంటలు కరెంటు ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపాన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు. చంద్రబాబు శిష్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని చెప్తున్న మాటలన్నీ కూడా ఆ పార్టీ సిద్ధాంతాలే అన్నారు.
బిజేపి పాలనకు గత్యంతరం లేక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారే తప్ప ఆ పార్టీ వల్ల అక్కడ ఒరిగేది కూడా ఏమీ లేదు. కర్ణాటకలో కూడా రైతులకు 24 గంటలు కరెంట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం అనేది లేదని, ఏఐసీసీ ఒకటి మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరొకటి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి అడిగిన వాటికి సమాధానం చెప్పడం చేతకాక బూతు పురాణాలు మొదలు పెడతారు.
అది ఓక నాయకుడి లక్షణం కాదు అని వారి పార్టి నాయకులే చెప్తున్నారని గుర్తు చేశారు. వారికి పదవులపై ఉండే వ్యామోహం ప్రజా పాలనపై ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే..రైతులకి ఉచిత 24 గంటలు కరెంటు ఉండదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అయితేనే ముందుచూపుతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని, సీఎం కేసీఆర్ మళ్లీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.