రామన్నపేట, మే 29: తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ నేతలకు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించే అర్హత లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను.. తల్లిని చంపి బిడ్డను బతికించారని అపహాస్యం చేసిన బీజేపీ నాయకులు, చంపిన వారే దినం పెట్టినట్టుగా సంబురాలు చేస్తామనడం సిగ్గుచేటని మండిపడ్డారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో రూ.8.50 కోట్లతో చేపట్టనున్న 4 వరుసల రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టానికి వచ్చినప్పుడల్లా విషం చిమ్మడం తప్ప నయాపైసా ఇవ్వలేదని ఆరోపించారు. మోదీకి మోకరిల్లుతున్న బీజేపీ నాయకులకు సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే ఏడు మండలాలను ఏపీలో కలుపడంతోపాటు 5 వేల మెగావాట్ల సీలేరు ప్రాజెక్టును ఏపీకి కట్టబెట్టడం ద్వారా బీజేపీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఒక పిట్టల దొర అని, ఉద్యమ సమయంలో ఆంధ్రవాళ్ల సంకలో చేరి తుపాకీ పట్టుకొని తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపుతానని తిరిగినోడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి దశాబ్ది ఉత్సవాలు చేసే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.