సూర్యాపేట : ప్రస్తుత సమాజంలో చిన్నారులకు కావాల్సిన అసలైన విద్య క్రీడలతోనే లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడమే లక్ష్యంగా సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి.. జిల్లాలో ఉన్న 155 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్ లకు క్రీడ సామగ్రితో కూడిన కిట్ల ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితాన్ని చదవడంలో క్రీడలదే ప్రముఖ పాత్ర అన్నారు. చిన్న,చిన్న కారణాలకు పిల్లలు ఇటీవల కాలంలో అఘాయిత్యాలకు పాల్పడటానికి కారణం తరగతి గది, హాస్టల్ గదికి పరిమితమవుతూ క్రీడలకు దూరంగా ఉండటం, క్రీడా స్ఫూర్తి కొరవడటమే పిల్లల అఘాయిత్యాలకు కారణం అన్నారు. ప్రస్తుత ఆధునిక యుగంలో సెల్,టీవీలకే పరిమితమవుతుండటంతో చిన్న, చిన్న కారణాలకు ఒత్తిడికి గురవుతున్న పిల్లలను బయట పడేయటంలో క్రీడలదే ప్రధాన పాత్ర అన్నారు.
క్రీడలలో గెలుపు, ఓటముల ద్వారా వచ్చే అనుభవాలు జీవితంలో వచ్చే ఆటు, పోటులను తట్టుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇటీవల తాను సూర్యాపేట నియోజక వర్గంలో నిర్వహించిన క్రీడల్లో సైతం వేలాదిగా ప్రజలు పాల్గొనడం, అందునా, మహిళలు 27 వేల మంది పాల్గొనడం నాకు ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.
50 ఏండ్ల వయసులో సైతం మహిళలు కబడ్డీ ఆడటం మంచి విషయమన్నారు. పిల్లలకు ఉపయోగపడే ఏ కార్యక్రమంలో అయినా నా భాగస్వామ్యం ఉంటుందన్న మంత్రి, క్రీడలతో కూడిన పరిపూర్ణ విద్యకు కేరాఫ్ గా ను ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది సూర్యాపేట జిల్లాను క్రీడా హబ్గా తీర్చి దిద్దాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావ్, డీఈవో తదితరులు పాల్గొన్నారు.