సూర్యాపేట : తెలంగాణ గర్వించే గొప్ప మానవతావాది కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy )కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో, పద్మశాలీ సంఘం నిర్వహించిన జయంతి వేడుకల్లో బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడిగా పలు పార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితం నేటి తరానికి ఆదర్శనీయమన్నారు.
అణగారిన వర్గాల హకుల సాధన కోసం, సహకార రంగాల పటిష్టత కోసం జీవితకాలం కృషి చేశాని ఆయన సేవలను కొనియాడారు. బహుజన నేతగా, నేతన్నలైన పద్మశాలీలను సంఘటితం చేశారని, తెలంగాణ కోసం నాడు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ స్ఫూర్తి మలిదశ తెలంగాణ సాధన పోరాటంలో ఇమిడి ఉన్నదని తెలిపారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి, వర్ధంతులను రాష్ట్ర ప్రభు త్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు.
రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి గౌరవించుకున్నామని పేర్కొన్నారు. చేనేత రంగంలో ప్రతిభావంతులైన కళాకారులకు ఆయన పేరుతో ప్రభుత్వం అవార్డులను అందజేస్తున్నదని తెలిపారు. త్వరలో స్థల పరిశీలన అనంతరం పట్టణంలో ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్స్ ప్రియాంక, వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పేరుమాళ్ల అన్నపూర్ణ, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, జడ్పీటీసీ జీడి భిక్షం, బీసీ సంఘం నాయకులు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వీ, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు అప్పం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.