శాలిగౌరారం, నవంబర్ 10 : పూటకో మాట మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బ్రదర్స్ పదవుల ఆకలితో ఉన్నారని.. ముఖ్యమంత్రి అవుతామన్న భ్రమలో ఉన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. వారిని ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, మొత్తానికి మొత్తంగా కాంగ్రెస్ను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని అడ్లూర్ గ్రామంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్తో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలు మారి, గోడలు దూకి వచ్చిన తమ్ముడికి అన్న వెంకట్రెడ్డి వత్తాసు పలుకుతున్నారని, ప్రజలు మాత్రం తిరస్కరించడం ఖాయమని అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బు ఉన్నదనే అహంకారాన్ని చూపుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ 60 ఏండ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు చేసిందేమీ లేకపోగా ఫ్లోరైడ్ మాత్రం పెరిగిపోయిందని విమర్శించారు. అన్న వెంకట్రెడ్డి, తమ్ముడు రాజ్గోపాల్రెడ్డికి పదవి వ్యామోహం పట్టింది కానీ.. ప్రజల అభివృద్ధి పట్టలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రాబోతున్నదని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు గ్రామగ్రామానికి వెళ్లి సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు. సమావేశంలో అయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు.