హైదరాబాద్ : కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి స్వార్థానికే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చిందని విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. కాంట్రాక్టుల ఒప్పందం మేరకే ఆయన తన పదవికి రాజీనామా చేశారని, ఈ విషయాన్ని స్వయంగా కోమటిరెడ్డే బహిర్గతం చేశారన్నారు. హైదరాబాద్లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎన్నికల ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్కు వస్తున్న పేరు, ప్రతిష్టలను తట్టుకోలేకే బీజేపీ ఉప ఎన్నికల కుట్రకు తెరలేపిందని విమర్శించారు. కాంట్రాక్టుల ఒప్పందానికి బీజేపీలో చేరింది చాలక.. త్యాగాల ట్యాగ్లైన్ తగిలించుకుని తిరుగుతున్నాడని మండిపడ్డారు. దిగజారుడు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అంటూ ఉంటే అది కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డేనని ఆయన విరుచుకుపడ్డారు. కాంట్రాక్తులకు అమ్ముడు పోయిన నేతకు ఎన్నికల్లో పోటీచేసే నైతికత ఎక్కడిదని నిలదీశారు.
కాంట్రాక్టు ఒప్పందాల గురించి ఆయన మాట్లాడిన మాటల ఆధారంగా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చెయ్యడంతో పాటు ప్రజాక్షేత్రంలో ప్రజలకు వివరిస్తామన్నారు. ధర్మయుద్ధంలో అంతిమ విజయం ధర్మానిదే అవుతుందన్న మంత్రి.. అలాంటి ధర్మపోరాటం ద్వారానే సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. బీజేపీకి ఓటువేస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు వస్తాయని.. విద్యుత్, వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తాయన్నారు. మునుగోడు ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. వంటగ్యాస్ మొదలు.. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత పెరుగుతాయన్నారు.
మునుగోడులో టీఆర్ఎస్ గెలిస్తేనే అపరిష్కృత సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయన్నారు. మూడున్నరేళ్లుగా మునుగోడులో అభివృద్ధి కుంటుపడిందని, అందుకు అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించిన రాజగోపాల్ రెడ్డే కారణమన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మాకు అంతో ఇంతో పోటీ అంటూ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయాలు నమోదు చేసుకున్న టీఆర్ఎస్ కేసీఆర్ సారథ్యంలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.