సూర్యాపేట : నిరు పేదలకు వరం జీవో 58 అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేటలోని సుందరయ్య నగర్లో ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు వేసుకున్న 95 మంది పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందించామని మంత్రి తెలిపారు.
గూడు లేని వారు ఎన్నోఏండ్ల నుంచి అభద్రతా భావంతో ఉంటున్నారన్న మంత్రి సుందరయ్య నగర్ ప్రజల ఇరవై ఏండ్ల కలఈ రోజు నెరవేరిందన్నారు. మీ కలను నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. పేదవాళ్లు ఎన్నో ఏళ్లుగా ఏ హక్కు లేకుండా జీవించడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలుసుకున్న మఖ్యమంత్రి ఇండ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చూట్టారన్నారు.
పేదలకు సొంత నివాసాల పేరుతో ఇండ్లు నిర్మించి, వారి పేరుతో బ్యాంకుల్లో అప్పులు మోపిన చరిత్ర గత పాలకులది అయితే, 4000 కోట్లు మాఫీ చేసి రుణ విముక్తులను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలకు మహిళలు, పేదలే కేంద్రబిందువు అన్నారు. మహిళలు, పేదలు బాగుంటేనే తెలంగాణ సార్థకమైనట్లు అని నమ్మే నాయకుడు కేసీఆర్ అన్న మంత్రి, ఇండ్ల పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
మారో విడతలో 45మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కలెక్టర్ వెంకట్రావు, మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా కిశోర్, కౌన్సిలర్ మాలోతు కమల, తదితరులు పాల్గొన్నారు.