విద్యుదుత్పత్తి కోసం నాగార్జునసాగర్నుంచి తాము నీటిని వినియోగించడం లేదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు చిల్లరగా వ్యవహరిస్తున్నదని విద్యుత్శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంపై ఏపీ సర్కారు చీటికీమాటికీ కృష్ణా నది మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఫిర్యాదు చేస్తున్నదని అసహనం వ్యక్తంచేశారు. అసంబద్ధమైన ఆరోపణలు, ఫిర్యాదులు చేసి ఏపీ సర్కారు తన గౌరవాన్ని దిగజార్చుకుంటున్నదని విమర్శించారు.
నాగార్జున సాగర్ నుంచి విద్యుదుత్పత్తి కోసం నీటిని తెలంగాణా వినియోగిస్తున్నదనే ఏపీ సర్కారు వాదనలో నిజం లేదని మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. సాగర్నుంచి తెలంగాణకు తాగునీటి అవసరాలు ఎక్కువని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఫిర్యాదుల్లో సహేతుకత లేదన్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో గ్రిడ్ను కాపాడేందుకు అప్పుడప్పుడు సాంకేతికపరంగా ఐదు , పది నిమిషాల ఉత్పత్తి జరగడం సహజమేనన్నారు.
శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి ఆపేసినా.. ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తున్నదని, అయినా తాము చిల్లర ఫిర్యాదులు చేయడంలేదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. సమైక్యాంధ్రలో దుర్మార్గంగా తమ నీటిని ఆంధ్రకు బలవంతంగా తరలించుకెళ్లారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ సర్కారుకు నీటి యాజమాన్యంపై అవగాహన లేదని, అందుకే తమపై ఫిర్యాదు చేస్తున్నదని జగదీశ్రెడ్డి విమర్శించారు.