Minister Jagadish Reddy | తెలంగాణ ప్రజలు, రైతాంగం కాంగ్రెస్తో అప్రమత్తంగా ఉండాలని, ఆ పార్టీ మాయమాటలు నమ్మి ఓటేస్తే కర్నాటక తరహాలో రాష్ట్రంలో అంధకారం రాజ్యం మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. కర్నాటకలో వ్యవసాయానికి రెండు గంటలు కూడా సరిగా కరెంటు సరఫరా చేయడం లేదంటూ రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని గుర్తించాలని సూచించారు. తెలంగాణ భవన్లో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకుడు రాజారాం యాదవ్తో కలిసి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు.
బెంగుళూరు సహా అన్ని ప్రధాన నగరాల్లో కరెంటు కోతలు ఉన్నాయని, కరెంటు కోతలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రివేళ్లల్లో కరెంటు సరఫరాతో
పాముల బాధనే కాకుండా.. మొసళ్ల బాధ కూడా ఉందన్నారు. రైతులు సబ్స్టేషన్లలో మొసళ్లను వదిలి
నిరసన తెలుపుతున్నారన్నారు. అక్కడ ఐదు గంటల కరెంటు ఇవ్వలేని కాంగ్రెస్ ఇక్కడ ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతుందని విమర్శించారు. కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మితే 2014 కు ముందు పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయన్నారు.
సీఎం కేసీఆర్ చిత్తుశుద్ధి, తెలంగాణ ప్రజలు, రైతాంగం సమస్యలపై ఆయనకున్న అవగాహనతో కరెంటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. కర్నాటకలోనే కాదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నిటిలో కరెంటు సరిగా లేదని.. ఛత్తీస్గఢ్లో మిగులు విద్యుత్ ఉన్నా.. ఇతర రాష్ట్రాలకు కరెంటు అమ్ముకుంటున్నారని.. రైతాంగానికి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ఉందని.. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఓటేస్తే గెలిస్తే ఇచ్చేది 3 గంటల కరెంటేనని స్పష్టం చేశారు.