హైదరాబాద్, ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యారంగంపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం తగదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హెచ్చరించారు. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధుల విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 5.98 శాతం నిధులు మాత్రమే వెచ్చించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని దేశపతి దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని విద్యారంగానికి నిధులు కోత పెట్టడం దారుణమని మండిపడ్డారు. తెలంగాణ సమాజం విద్యావంతులు కావడం, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదువడం రేవంత్రెడ్డికి ఇష్టం లేదా? అని ప్రశ్నించారు. నిధుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, వర్సిటీల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఖరితో విద్యార్థుల భవిష్యత్తు, విద్యావ్యవస్థ పునాదులు దెబ్బతింటున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా విద్యారంగానికి కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని దేశపతి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.