సూర్యాపేట : దేశంలో అత్యధిక గ్రీన్ రివల్యూషన్ సాధించిన రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు.తొమ్మిదేండ్లలో 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని వెల్లడించారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం అడ్డగూడూరులో శాసన సభ్యులు కిషోర్కుమార్తో కలిసి హరితోత్సవం(Haritha Haram)లో మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ 2014కు ముందు అటవీశాఖ కే పరిమితమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్టించుకునే నాథుడే లేడన్నారు. కేసీఆర్(CM KCR) సీఎం అయ్యాక తెలంగాణ ఉద్యమం (Telangana Agitation) నడిపించిన తీరు గానే, హరిత ఉద్యమం నిర్వహించి, తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని ప్రజలకు అలవాటు చేశారని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం అంటే ప్రజల బతుకుచిత్రాన్ని మార్చడమే కాదు. ధ్వంసమైన అడవులను పునరుద్ధరించడం, సకల జీవరాశులను సంరక్షించడమని చాటిచెప్పిన దార్శనిక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.
ఆధునిక సమాజం లో మానవుడి మనుగడ , ఆయు ప్రమాణాలు తగ్గడానికి ప్రధాన కారణం పర్యావరణ కాలుష్యమే అన్నారు. రోజు రోజు కు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అనారోగ్యాలకు చెట్లను పెంచడం ద్వారానే అడ్డుకట్ట వేయవచ్చని పేర్కొన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.