హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీకి సరిగ్గా అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీకి రేవంత్ అధ్యక్షుడని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని, ఆ పార్టీలకు చెందినవాడు కావడం వల్లే రేవంత్ పిండాల గురించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రేవంత్.. సీఎం కేసీఆర్కు పిండం, తద్దినం ఎందుకు పెడ్తావ్? పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నందుకా? ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినందుకా? తన ప్రాణాలు అడ్డంపెట్టి తెలంగాణకు ప్రాణం పోసినందుకా?’ అని ప్రశ్నించారు. రేవంత్ మాట్లాడే భాషను కనీసం వాళ్ల ఇంట్లోనైనా ఒప్పుకొంటారా? అని అడిగారు. సీఎం కేసీఆర్ గనుక రాజకీయ కక్ష ప్రదర్శిస్తే రేవంత్ రోడ్ల మీద తిరుగలేడని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో రేవంత్కు భంగపాటు తప్పదని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని స్పష్టం చేశారు. గద్దర్ గురించి అజ్ఞాని రేవంత్కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడని ప్రశ్నించారు. గద్దర్ తమతో కలిసి పనిచేశారని, గద్దర్ గురించి రేవంత్ మాట్లాడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని పేర్కొన్నారు. రేవంత్ ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీ ఖతమే అని వ్యాఖ్యానించారు.
సంస్కారంలేని పార్టీకి రేవంత్ అధ్యక్షుడు. పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే. ఆ పార్టీలకు చెందినవాడు కావడం వల్లనే పిండాల గురించి రేవంత్ మాట్లాడుతున్నడు. ప్రజల చేతిలో ఆయనకు భంగపాటు తప్పదు.
-మంత్రి జగదీశ్రెడ్డి