సూర్యాపేట : సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణ నీటిపారుదల రంగం నిర్లక్ష్యానికి గురైందని అందుకు ఎస్ఆర్ఎస్పీ నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుదవారం సాగునీటి దినోత్సవాన్ని(Irrigation day) సూర్యాపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. కాళేశ్వరం(Kaleshwaram) జలానికి-లక్ష జనహారతి పేరుతో చివ్వేంల మండల కేంద్రంలోని 71 డీబీయం కాళేశ్వరం జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యపాలనలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ లోని భూములు బీళ్లుగా మారాయి తప్ప చుక్క నీరు రాలేదని ఎద్దేవా చేశారు. ఎస్ఆర్ఎస్పీ(SRSP) ద్వారా కేవలం 6,000 క్యూసెక్కుల నీటిని 350 కిలోమీటర్ల దూరం పారించి నల్లగొండ ప్రజలకు అందించడం అసాధ్యమని అన్నారు. ఎస్ఆర్ఎస్పీని చూపి జిల్లా ప్రజలను మోసం చేస్తు వచ్చిన సీమాంద్ర పాలకుల దోపిడీని కనిపెట్టిన తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్(KCR) నీళ్లు, నిధులు,నియామకాల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టారన్నారు.
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత నీటిపారుదల రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ప్రాణహితతో కలిసి గోదావరి సజీవంగా ఉంటుందని మెడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి అక్కడి నుంచి తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ ప్రాంతాలకు నీళ్లు పారించారని ఆయన తెలిపారు.
దీంతో ఈ ప్రాంత భూములు సస్యశ్యామలం అయ్యాయని వివరించారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.