Minister Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా పని చేస్తుందని రాష్ట్ర విద్యుత్ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ వారసుడుగా రాహుల్ గాంధీని లోకసభ నుంచి వెలి వేసి అక్రమంగా ఇంటిని ఖాళీ చేయిస్తే ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు సోయిలేక పోగా బీజేపీతోని అంటకాగుతున్నారని విమర్శించారు. కోదాడ నియోజకవర్గ పరిధిలోని కోదాడ పురపాలక సంఘం పరిధిలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఇన్చార్జి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి, గాధరి కిశోర్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలో లీకేజీల పర్వానికి తెరలేపాయన్నారు. వాస్తవానికి దేశంలో నిరుద్యోగశాతాన్ని పెంచి పోషించిందే బీజేపీ, కాంగ్రెస్లేనని మండిపడ్డారు. ఆ పార్టీలు నిరుద్యోగులకు వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. నిరుద్యోగ శాతాన్ని పెంచి పోషించిన కాంగ్రెస్, బీజేపీలు మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో 1.32లక్షల ద్యోగాలు భర్తీ చేశామన్నారు. ఏక కాలంలో 23వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్దీకరించిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. మరో 90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి ప్రక్రియ మొదలు పెట్టంగానే లీకేజీ కుట్రలకు తెరలేపి నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించారని మండిపడ్డారు.
90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వంగానే జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సొంత ఖర్చులతో ఆయా ఉద్యగాల అర్హతా పరీక్షల కోసమై శిక్షణా తరగతులు నిర్వహించిన విషయాన్ని మంత్రి జగదీశ్రెడ్డి గుర్తు చేశారు. 2014 ఎన్నికలకు పూర్వం దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన మీదట ప్రతి సంవత్సరం రెండుకోట్ల ఉద్యగలను భర్తీ చేస్తామంటూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. అదే ఎన్నికల ప్రచారంలో దేశంలో 25 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని.. అధికారంలోకి వచ్చిందే తడవుగా ఉద్యగాల భర్తీ ఉంటుందంటూ మాయ మాటలు చెప్పిన మోదీ నిరుద్యోగులను నిండా ముంచారని ఆయన విమర్శించారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ భర్తీ చేసిన విధంగా కేంద్రం తొమ్మిదేళ్లలో సంవత్సరానికి రెండుకోట్లు చొప్పున భర్తీ చేసి ఉంటే తెలంగాణ నుంచి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవన్నారు.
తెలంగాణలో 1,32,649 ఉద్యగాలను భర్తీ చేసినట్లు అధికారికంగా గణాంకాలు వెల్లడిస్తున్నామని, అదేవిధంగా మాతో పాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ దేశంలోని అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో కనీసం 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించారా అంటూ నిలదీశారు. మధ్యప్రదేశ్లో కనీసంలో కనీసం 30వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు నిరూపిస్తారా? అంటూ ఆయన బీజేపీకి సవాల్ విసిరారు. గుజరాత్ సంగతి సరేసరి అంటూ ఆయన ఎద్దేవా చేశారు. శనివారం రాత్రి అటు మీడియా ఇటు పోలీసుల కళ్లెదుటే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉదంతాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ఉదహరించారు. బీజేపీ, కాంగ్రెస్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే వణుకు పుడుతుందని, అందుకే లీకేజీ డ్రామాలకు తెరలేపి లబ్ధి పొందే యత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే నిప్పు కణిక అని.. ముట్టుకోవడం కాదు జోలికి వస్తేనే భస్మం అవుతారని మంత్రి హెచ్చరించారు.