సూర్యాపేట టౌన్, జూలై 4: ‘కేంద్రంలోని బీజేపీ ఒక్క ఇంజిన్ పాలన రోకలి పోటులా ఉన్నది.. ఇక డబుల్ ఇంజిన్ పాలన వస్తే ప్రజలకు మద్దెల దరువే. గుజరాత్తోపాటు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల పరిస్థితి ఇదే’ అని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మండిపడ్డారు. బీజేపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి దేశంలో శాశ్వతమైన అభివృద్ధి కోసం ఒక్క పథకమైనా ప్రవేశపెట్టారా? అని ప్రశ్నించారు. ఎనిమిదేండ్ల మోదీ పాలన ఇద్దరు ముగ్గురు వ్యాపారుల గురించే సాగింది తప్ప.. చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏం జరిగిందో చెప్పాలని నిలదీశారు.
సూర్యాపేటలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలోని అన్ని ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని, ఈ విషయం ఇక్కడి బీజేపీ నాయకులకు తెలిసినా చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ఇక్కడ తిరుగుతున్న కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులైనా తెలంగాణ అభివృద్ధి గురించి ప్రధాని మోదీకి, బీజేపీ పాలిత రాష్ర్టాలకు చెప్పాలని హితవుపలికారు.
ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్న మోదీ
ప్రధాని మోదీ దేశంలో ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో నూతన ఎజెండా అంశంపై రాజకీయ పండితులు చర్చించుకుంటున్నారని చెప్పారు. ఆ దిశగా దేశ ప్రజలు నూతన ఎజెండా తయారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. 14 ఏండ్లు ఉద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించిన సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలోనే యావత్ దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దారని చెప్పారు.
ప్రస్తుతం అనేక రాష్ర్టాలు సీఎం కేసీఆర్ పాలన తీరును స్వాగతిస్తున్నాయని అన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే అంతా భయపడుతున్నారని, కేసీఆర్ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ పాలన వస్తే బాగుంటుందని దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ను చూస్తే దేశంలో బీజేపీ నాయకత్వానికి వణుకు పుడుతున్నదని, అందుకే తెలంగాణకు వచ్చి కేసీఆర్ పాలన, అభివృద్ధిపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు.