నల్లగొండ : ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల తెలంగాణలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి(Minister Jagadish reddy) వెల్లడించారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్టణంలో వైద్య ఆరోగ్య దినోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి(Development), సంక్షేమ రంగాల్లో(Welfare Schemes) ముందుకు పోతుందని వెల్లడించారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నియామకంతో పాటు నూతన పరికరాలు, అధునాతన వైద్య యంత్రాల ఏర్పాటు, భవనాల నిర్మాణాలు, కళాశాలలు, వైద్య శాలలను ప్రభుత్వం కొత్తగా నెలకొల్పిందని అన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులో నేడు ఓపీలు, ఆపరేషన్లు(Operations) పెరిగాయని పేర్కొన్నారు. ఏరియా ఆసుపత్రుల్లోనే డయాలసిస్ కేంద్రాలను నెలకొల్పి వైద్యాన్ని అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మాతృ, శిశు మరణాల సంఖ్య తగ్గిందన్నారు. లక్ష మందిలో 97 మాతృ మరణాలు ఉంటే నేడు 39కి తగ్గిందని పేర్కొన్నారు.ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 39 మరణిస్తే నేడు 27కి తగ్గిందని వివరించారు.
2014లో ప్రభుత్వాసుపత్రుల్లో 31శాతం, ప్రైవేట్ లో 69 శాతం నార్మల్ డెలివరీలుండగా నేడు ప్రభుత్వాసుపత్రుల్లో 58 శాతం పైగా నార్మల్ డెలివరీలు అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నాటికి రాష్ట్రంలో 2500 మెడికల్ సీట్లు ఉంటే.. నేడు ఆ సంఖ్య 25వేలకు పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీఎంహెచ్వో కొండలరావు తదితరులు పాల్గొన్నారు.