మునుగోడు ప్రజలు ఎప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలు ఎప్పటికీ కృతజ్ఞులై ఉంటారని ఆయన చెప్పారు. ఏడు దశాబ్దాలుగా మునుగోడును పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ను నిర్మూలించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దని కొనియాడారు. మునుగోడు మండలం పులిపలుపుల గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కుటుంబాలు మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరాయి.
నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, యంపీపీ స్వామి, మండల పార్టీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ తపన ప్రజల కోసం కాదని, కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమేనని అందరూ గుర్తించాలన్నారు. అందుకే ఎప్పుడూ మీడియాలో ఉండే విదంగా సొంత పార్టీ నేతలపై విమర్శలకు దిగుతూ వార్తల్లో ఉంటారన్నారు.
మూడు ఏండ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే బీజేపీకి కోవర్ట్గా పనిచేసి, చివరికి అదే పార్టీలో రాజగోపాల్ రెడ్డి చేరారని మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. బీజేపీలో చేరినందుకు మోడీ, అమిత్ షాల ద్వయం అప్పనంగా అప్పగించిన రూ.22వేల కోట్ల కాంట్రాక్టు మునుగోడు ప్రజలు వేసిన ఓట్ల చలువేనని దుయ్యబట్టారు.