హైదరాబాద్: దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తుందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంపై ప్రజలలో రోజురోజుకు విశ్వనీయత పెరుగుతున్నదని చెప్పారు. హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్.. మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన సరిహద్దు రాష్ట్రాల ప్రజలు తమ ప్రాంతాలను తెలంగాణలో (Telangana) కలపాలని డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ అదే పనిగా ఉదరగొడుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రజలు కూడా తాము తెలంగాణలో కలుస్తామంటున్నారని గుర్తుచేశారు. ఆపార్టీ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలోని ప్రజలు సైతం ఇదే తరహాలలో కోరుతున్నారని ఉఠంకించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్ తదితరులు పాల్గొన్నారు.