భువనగిరి: ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తీసుకొచ్చి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ (BJP) చూస్తున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. భారతదేశాన్ని నడుపుతున్నది ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షాలు (Amit Shah) కాదని, ఒకరిద్దరు పెట్టుబడిదారులు మాత్రమేనని విమర్శించారు. వారి స్వార్థప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని ఫణంగా పెడుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ‘మన ఉత్పత్తులు-మన గౌరవం’ భవనాన్ని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ (Telangana) గడ్డపై బీజేపీ ఆటలను ప్రజలు సాగనివ్వరని చెప్పారు.
దేశంలో 35 శాతం మంది ప్రజలు తినడానికి తిండి లేకుండా ఉన్నారని.. దీనికి ప్రధాని మోదీ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. బీజేపీ వల్ల దేశం 30 ఏండ్లు వెనక్కి పోయిందని విమర్శించారు. ప్రపంచం ముందు దేశ పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న మూడు సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. ప్రజలు బీజేపీ డిపాజిట్లు గల్లంతు చేస్తారని వెల్లడించారు. తెలంగాణలో కమలం పార్టీ పప్పులు ఉడకవని, ఇక్కడున్నది మహా నేత సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.