యాదాద్రి భువనగిరి : సీఎం కేసీఆర్ పాలన దేశానికి రోల్ మోడల్గా నిలిచిందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. భోనగిరిలో 12న సీఎం కేసీఆర్ పర్యటించనుండగా.. సమీకృత కలెక్టర్ భవన సముదాయాలతో పాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు చేయగా.. సభాస్థలి వద్ద ఏర్పాట్లను మంత్రి గురువారం పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అప్రస్తుతమైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అక్కసు వెళ్లగక్కిన బీజేపీ పాలకులు సైతం కేసీఆర్ పాలనను అద్భుతమని కితాబిచ్చారన్నారు. కొత్త రాష్ట్రమైనా వేరుపడి బాగుపడ్డామని.. అదే ఇప్పుడు కేంద్రానికి కంటిమీద కనుకు లేకుండా చేస్తుందన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలు హస్తినలో గుబులు రేకెత్తిస్తుందని, ఉచిత విద్యుత్ కమలనాథులకు కంటగింపుగా మారిందన్నారు.
రైతుబంధు, రైతుబీమా వంటి విప్లవాత్మకమైన పథకాలు మోదీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు బీజేపీ పాలకులకు కంట్లో నలుసయ్యాయన్నారు. అందుకే అణచివేత కుట్రలకు బీజేపీ పాలకులు తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వ పరిరక్షణకు గులాబీ శ్రేణులు దండు కట్టాలని జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 12న భోనగిరిలో జరిగే సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు శేఖర్రెడ్డి, గాధరి కిశోర్కుమార్, రవీంద్రకుమార్, ఎన్ భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.