హైదరాబాద్ : హైదరాబాద్ పాత నగరంలో 1,404.58 కోట్ల వ్యయంతో ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లువిద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 1,330.94 కోట్ల పనులు పూర్తి కాగా మరో 73.64 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలిపారు. శుక్రవారం తెలంగాణ శాసనమండలిలో ఎంఐఎంకు పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు మీర్జా రియాజల్ హసన్, మీర్జా రహమత్ బేగ్ లు అడిగిన ప్రశ్నకు మంత్రి జగదీష్ రెడ్డి సమాధానమిచ్చారు.
అలాగే 1,404.58 కోట్ల ట్రాన్స్మిషన్ కు గాను ట్రాన్స్కో నుంచి 957.29 కోట్లు వెచ్చించగా టీఎస్ఎస్పీడీసీఎల్ 447.29 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన సభకు తెలిపారు. గడిచిన తొమ్మిదేళ్ల వ్యవధిలోనే ఇంత పెద్ద మొత్తం ఖర్చు చేసి విద్యుత్ ప్రసారాలను క్రమబద్దీకరించినట్లు ఆయన పేర్కొన్నారు. నాలుగు
220 కేవీ సబ్ స్టేషన్లు, 132 కేవీ సబ్ స్టేషన్లు రెండు, 33/11 కే వి సబ్ స్టేషన్లు 15,256 కిలోమీటర్ల 33 కేవీ లైన్ తో పాటు 63 ఆదనవు ట్రాన్స్ ఫార్మర్స్ ను ఏర్పాటు చేశామన్నారు.
16 ట్రాన్స్ఫార్మర్స్ సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు 565 కిలోమీటర్ల 11 కేవీ లైన్ ను వేసినట్లు ఆయన చెప్పారు. ఓల్డ్ సిటీకి చెందిన శాసనసభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి వారి అభ్యర్థన మేరకే ఈ నిర్మాణాలు జరిగాయన్నారు. సబ్ స్టేషన్ల నిర్మాణాల విషయంలో స్థలానికి సంబంధించిన అంశాలు ఆటంకాలు ఎదురైనప్పటికి స్థానిక శాసనసభ్యుల ప్రమేయంతో పరిష్కరించినట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలకు అష్కారమే లేదని ఆయన తేల్చిచెప్పారు. విపత్తు సమయంలోనూ విద్యుత్ ప్రసారాలలో అంతరాయం కలుగ కుండా చేసిన ఘనత తెలంగాణ విద్యుత్ సంస్థల యజమాన్యాలది, అందులో పని చేసే సిబ్బంది దని ఆయన కొనియాడారు.