సూర్యాపేట : బీఆర్ఎస్ అంటే స్కీంలు..కాంగ్రెస్ అంటే స్కాంలు అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ను నమ్మితే కరెంట్ ఖతమే అన్నారు. దామోదర్ రెడ్డి పాలనలో మూడు కొట్లాటలు ఆరు కేసులు తప్పా.. గ్రామాలు, పట్టణంలో జరిగిన అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. ఆఖరి సారి అంటూ కొంగ జపం చేస్తున్న వారికి ఓటేస్తే భవిష్యత్తు నాశనమేనని స్పష్టం చేశారు.
జగదీష్ రెడ్డి ఏమీ చేయలేదు అంటున్న దామోదర్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో సూర్యాపేటలో జరిగిన అభివృద్ధి పై చర్చకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. సూర్యాపేటలో మూడోసారి నన్ను ఆశీర్వదిస్తే 25 వేల వు మంది యువతీ యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా, డ్రై పోర్ట్ ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొస్తానని హామీ ఇచ్చారు. ఐటీ పరిశ్రమను కూడా 3000 ఉద్యోగులతో విస్తరింజేస్తామన్నారు. డ్రై పోర్ట్ నిర్మాణంతో సూర్యాపేట రూపురేఖలే మారిపోతాయని అన్నారు. మీ బిడ్డగా మరోసారి ఆశీర్వదించాలని మంత్రి కోరారు.