Minister Jagadish Reddy | సాగర్ నీటి విషయంలో మొండి వైఖరితో ఏపీ తొండి చేస్తోందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. సూర్యాపేటలో గురువారం ఆయన ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం నాగార్జున సాగర్ నీటి వివాదంపై మంత్రి జగదీశ్రెడ్డి స్పందించారు. సాగర్ నీటి విషయంలో మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్ మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు , జగన్ ప్రభుత్వాల్లో కృష్ణా నీటి సమస్య కొనసాగుతుందన్నారు. కేంద్ర కృష్ణా నీటి పంపకాల సరైన నిర్ణయం తీసుకోకపోవడంతోనే సమస్య వస్తుందన్నారు.
తెలంగాణ ప్రజలు తమ హక్కు వదులుకోవడానికి సిద్ధంగా లేరన్నారు. నీటి పంపకాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మొండి వైఖరితో తోండి చేస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వాటా నుంచి ఒక్క చుక్క కూడా పోనీయమన్నారు. సాగు, తాగు నీటి కొసం మేమంతా సాగర్పై ఆధారపడి ఉన్నామన్నారు. కోట్లాది మంది ప్రజలు జీవితాలతో చేలాగాటమాడే పద్ధతిలో ఆంధ్ర వ్యవహారం ఉందని.. ఇది ఏమాత్రం సరైంది కాదన్నారు. ఆంధ్రా తీరును సహించబోమన్నారు. కేసీఆర్ ఉన్నంత కాలం రాష్ట్ర హక్కుల్ని హరించడం ఎవరివల్ల కాదన్నారు. నీటి వివాదం అడ్డంపెట్టుకుని చిల్లర రాజకీయం చేసే అలవాటు తమకు లేదన్నారు.