Minister Jagadish Reddy | నీటిపారుదల రంగంలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ విజయాలు సాధించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సముద్రం కట్టపై జరిగిన చెరువుల పండుగ కార్యక్రమానికి జగదీశ్రెడ్డి హాజరై, జలానికి హారతి ఇచ్చి కుంకుమపూలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్బ సముద్రంపై మినీ ట్యాంక్బండ్ నిర్మిస్తామన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాలి అన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. సుబ్బ సముద్రం నీరు మంచినీటి వినియోగానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దుతామన్నారు. మూసి మురికి నుంచి బయటపడేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. చేపల పెంపకంలోనూ తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు తమకు ఎవరూ సాటిరారు అనుకున్న ఏపీకి మించి తెలంగాణలో చేపల పెంపకం కొనసాగుతుందన్నారు.
లక్షకోట్ల వ్యయంతో నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టులు నిర్మించి జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన చరిత్ర తెలంగాణ సీఎం కేసీఆర్కు దక్కిందన్నారు. దాంతో రూ.50లక్షల ఎకరాలు స్థిరీకరణ జరిగిందన్నారు. 2014కు ముందు ఏనాడు మూసినీటితో రెండు పంటలు పండించిన చరిత్ర లేదన్నారు. అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరానికే రూ.20కోట్లతో మూసి ప్రాజెక్టుకు మరమ్మతులు నిర్వహించడం ద్వారా వరుసగా16 పంటలకు సమృద్ధిగా నీరు అంది రికార్డు స్థాయిలో పంటలు పండించుకున్నామన్నారు.
పోరాడి సాధించికున్న తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్, నీటి పారుదల, విద్య, వైద్యం, ఫ్రెండ్లీ పోలీసింగ్, తదితర రంగాలలో తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను మననం చేసుకునేందుకే దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నామన్నారు. అలాంటి అద్భుతమైన విజయాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఈ నేల ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. అలాంటి మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శరణ్యమన్నారు.