హైదరాబాద్, అక్టోబరు 31 (నమస్తే తెలంగాణ): బీజేపీకి మునుగోడుపై ప్రేమ ఉంటే ఇప్పటికైనా ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడి రూ.18 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని తీసుకురావాలని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికలకు రెండురోజుల సమయం ఉన్నదని, వెంటనే ప్రకటించేలా చూడాలన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్తో కలిసి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు దొంగలకు, ద్రోహులకు బుద్ధి చెప్తారని, బీజేపీ మ్యానిఫెస్టోను నమ్మరన్నారు. చేనేతకు జీఎస్టీపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మునుగోడు ఎన్నిక ప్రచారంలో కేంద్రం ఏం పనిచేసిందో చెప్పలేదని, గెలిస్తే ఎం చేస్తారో కూడా చెప్పలేదని పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేలిందన్నారు.
బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లో కృష్ణా జలాల్లో నీటి వాటాను తేలుస్తామని ప్రకటించాలని సవాల్ విసిరారు. గుజరాత్ మాడల్ గోల్మాల్ మాడల్ అని తేలిందన్నారు. ఇటీవలే గుజరాత్ను అంధకారంలోకి నెట్టి బీజేపీ నేతలు ఘనత వహించారన్నారు. మునుగోడులో జగదీశ్రెడ్డి ప్రచారాన్ని ఆపగలిగారు కానీ టీఆర్ఎస్ గెలుపును ఆపలేరని స్పష్టంచేశారు. తప్పుడు సమాచారం ఇచ్చి తనను ప్రచారం చేయనీయకుండా చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఫ్లోరైడ్ సమస్య సహా అనేక ఇబ్బందులు తొలగిపోయాయని, కొత్తగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను 15 రోజుల్లో నెరవేరుస్త్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదలకు, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు ఎమీ చేయలేదని వెల్లడించారు.
బీజేపీకి బీ టీం కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీంగా వ్యవహరిస్తున్నదని మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర గుజరాత్ మీదుగా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. మోదీతో కాంగ్రెస్ ఒప్పందం దీని ద్వారానే అర్థమవుతున్నదన్నారు. ఇప్పటికైనా అవకాశం ఉన్నదని, గుజరాత్ మీదుగా జోడో యాత్రను చేపట్టాలన్నారు. మునుగోడులో క్యాడర్ను కాపాడుకోలేని కాంగ్రెస్ నాయకులు, ఏదో సాధిస్తామని చెప్తున్నారని విమర్శించారు. లేని పార్టీలతో పొత్తు ఎవరు పెట్టుకొంటారని ప్రశ్నించారు.
సీబీఐ బీజేపీకి తోక సంస్థ
అత్యద్భుతంగా పనిచేసే పోలీస్ వ్యవస్థ తెలంగాణలో ఉన్నదని మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి తోక సంస్థలాగా, అనుబంధ సంస్థగా సీబీఐ మారిందని ఆరోపించారు. ఇతర ప్రభుత్వాలను కూల్చడానికి సీబీఐని వాడుకొంటున్నారని విమర్శించారు. దానిలో భాగంగానే సీబీఐ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదన్నారు.