సూర్యాపేట : విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మరోమారు తన దాతృత్వాన్ని చాటుకున్నారు. సమస్య చెప్పుకునేందుకు వచ్చిన దివ్యాంగుడి సమస్య తెలుసుకుని చలించిపోయారు. వారి కుంటుంబానికి కొండంత అండగా నిలిచారు. వెంటనే బాధితుడి కుటుంబానికి అన్నివిధాలుగా సాయమందించారు.
వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది అనారోగ్యం కారణంగా రెండు కాళ్లు కోల్పోయిన నజీర్ పాషా అతని భార్య సాజితతో కలిసి మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. అప్పటికే ప్రజల సమస్యలు తెలుసుకుంటూ బిజీగా ఉన్నప్పటికి.. వారు లోపలికి వచ్చే క్రమంలో పరిస్థితిని గమనించిన మంత్రి తానే స్వయంగా వారివద్దకు వెళ్లారు.
జరిగిన సంఘటనతో పాటు ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే బాధితుడికి ట్రై సైకిల్, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని హామీనిచ్చారు. అలాగే తక్షణమే ఆర్థిక సాయం అందించారు. పాషా కుటుంబానికి నిరంతర ఆదాయం కోసం ఏదైనా మార్గం చూపుతామని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు.
సమస్యను విన్నవించుకుందామని ఆశతో వచ్చిన తమకు కొండంత అండగా నిలిచిన మంత్రి జగదీష్ రెడ్డికి నజీర్ పాషా కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.