సూర్యాపేట : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచేందుకు గ్రంథాలయాలు దోహదపడతాయని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy )తెలిపారు. సూర్యాపేటలోఅత్యాధునిక వసతులతో మూడు కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన గ్రంథాలయ భవనానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గ్రంథాలయ కార్యదర్శి శాస్త్రిలతో కలిసి మంత్రి జశంకుస్థాపన చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ గత పాలకుల హయాంలో శిథిలావస్థకు చేరుకున్న గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన ఘనత ముఖ్య మంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. గ్రంథాలయాలకు ప్రభుత్వం ఇస్తున్న నిధులు, మౌలిక వసతులు కల్పనతో వేలాది మంది విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు.
ఇటీవల కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో 23 మంది యువతీ యువకులు సూర్యాపేట గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. యువతీ యువకులకు ఉపయోగపడే విధంగా అన్ని వసతులతో , అత్యాధునిక సదుపాయాలతో గ్రంథాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సెంట్రల్ ఏసీతో పాటు డిజిటల్ లైబ్రరీ సౌకర్యాన్ని కూడా నూతన లైబ్రరీలో అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నూతన గ్రంథాలయానికి శంకుస్థాపన చేసిన మంత్రి జగదీష్ రెడ్డికి యువతీ యువకులు ధన్యవాదాలు తెలిపారు.