సూర్యాపేట : తెలంగాణ పారిశ్రామిక ప్రగతి దేశానికే ఆదర్శమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Minister Jagadish Reddy)అన్నారు. మంగళవారం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న పారిశ్రామిక ప్రగతి(Industrial progress ) కార్యక్రమాన్ని సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 36 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్న ఆటో నగర్ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు.
దశాబ్దాల తరబడి గోసపడ్డ తెలంగాణ ప్రజలు అనతికాలంలోనే అనూహ్యమైన ప్రగతి సాధించి శాఖల వారీగా ఉత్సవాలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గతంలో సబ్ స్టేషన్లపై దాడులు(Attack) జరిగిన పరిస్థితుల నుంచి సబ్ స్టేషన్లలోనే ఉత్సవాలు చేసుకునే స్థితికి తెలంగాణ చేరిందన్నారు. పోలీసులకు, ప్రజలకు మధ్య తీవ్రమైన అగాధం ఉండేదని ప్రస్తుతం పోలీసులతో మమేక మై ప్రజలు ఉత్సవాల్లో పాల్గొనడం తెలంగాణలో ఫరడవిల్లుతున్న శాంతి భద్రత(Law and Order)లకు నిదర్శనమన్నారు.
తెలంగాణపై అక్కసు వెళ్లగక్కే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమతో విడిపోయిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుందని కొనియాడారని తెలిపారు. దేశంలో నెంబర్వన్ ఇండ్రస్ట్రియల్ పార్కుగా దండు మల్కాపూర్ అవతరించిందని వెల్లడించారు. పారిశ్రామిక రంగంలో 22 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిన ఘనత సీఎం కేసీఆర్(CM KCR)దేనన్నారు. తొమ్మిందేడ్ల డబుల్ ఇంజన్ సర్కార్(Double Engine Sarkar) పాలనలో వారానికి రెండు రోజుల పవర్ హాలిడే కొనసాగుతుందని వివరించారు.
కర్నాటకలో ప్రత్యామ్నయం లేకనే కాంగ్రెస్ను గెలిపించారని, తెలంగాణలో బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో కాలుష్యపు నీటిని తాగిన జిల్లా ప్రజలు నేడు కృష్ణా జలాలు తాగుతున్నారని పేర్కొన్నారు. ఆటో నగర్ నిర్మాణంలో భూమి కోల్పోయిన పేదలకు న్యాయం చేస్తానని అంతకంటే మంచి వ్యవసాయ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడి బిక్షం, తదితరులు పాల్గొన్నారు.