నల్గొండ : ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రూ. రెండు కోట్ల 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన CT స్కాన్, ల్యాబ్ను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే అంటే ప్రజలు భయపడేవారని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి తీసుకున్న చర్యల వల్ల చిన్న జ్వరం నుంచి, క్యాన్సర్ వరకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని మంత్రి అన్నారు. వైద్య నిర్దారణ పరీక్షల కోసం అన్ని ఆస్పత్రుల్లో ప్రభుత్వమే డయాగ్నోస్టిక్ ల్యాబ్లను ఏర్పాటు చేసిందని అన్నారు.
నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన CT స్కాన్ ల్యాబ్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంతో లాభదాయకంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజక వర్గ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్, నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆసుపత్రి సూపరింటెండెంట్ జై సింగ్ రాథోడ్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ మాతృ నాయక్, డాక్టర్ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.