సూర్యాపేట: దేశ రక్షణలో యువత భాగమవ్వాలని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కల్నల్ సంతోశ్ బాబును స్ఫూర్తిగా తీసుకోవాలని యువతీ యువకులకు సూచించారు. సోమవారం ఉదయం సూర్యపేట జిల్లా కేంద్రంలో ది సోల్జర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆర్మీ ప్రీ రిక్రూట్మెంట్ ర్యాలీని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు. దివంగత కల్నల్ సంతోశ్ బాబు త్యాగంతో ప్రపంచ చిత్రపటంలో సూర్యాపేటకు చోటు దక్కిందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ర్యాలీకి తరలి వచ్చిన వారందరిని అభినందించారు.
ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకున్న రోజునే యువత పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుంటుందని మంత్రి చెప్పారు. అందుకు భిన్నంగా క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతూన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజం, దేశం మనదే అనగలిగినప్పుడే భవిష్యత్ ఉంటుందన్నారు. అలాంటి భవిష్యత్ కల్పించేందుకు ఆర్మీ దోహదపడుతుందని వెల్లడించారు. ఈ ర్యాలీలో ఎంపికైన రెండు నెలలపాటు శిక్షణ అందిస్తారని, వారందరికి భోజన సౌకర్యాలు కల్పిస్తానని మంత్రి ప్రకటించారు.