హైదరాబాద్ : మునుగోడు ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీకి మీటరు పెడుతరని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మునుగోడులో హోం మంత్రి అమిత్, ఆ పార్టీ నేతల చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. అమిత్ షా ప్రసంగమంతా అబద్ధాలేనన్నారు. అన్నీ నిరాధార ఆరోపణలు చేశారని విమర్శించారు. కేసీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారన్నారు.
సీఎం ప్రశ్నలకు జవాబు చెప్పే దమ్ముకూడా బీజేపీ నేతలకు లేదన్నారు. దిగజారుడు తనం ఆయన మాటల్లో ధ్వనించిందన్నారు. అమిత్ షా మాటలు హోం మంత్రిత్వశాఖ స్థాయిలో లేవని, ఫక్తు రాజకీయాలు, ఓట్లు, సీట్లు, అధికారం తప్ప మరొకటి మాట్లాడలేదని విమర్శించారు. ప్రపంచంలోనే అద్భుత పథకం రైతుబీమా అన్న మంత్రి.. ఫ్లోరైడ్ నివారణకు ప్రధానమంత్రి ఏమైనా చేశారా? నిలదీశారు.
పెట్రోల్ ధరలపై అమిత్ షా మాటలు దొంగే దొంగ అన్నట్లుందన్నారు. ఆధారం లేకుండా మాట్లాడే బండి సంజయ్ పాత్ర పోషించారన్నారు. కేంద్ర హోం మంత్రి వరాలు ప్రకటిస్తారని మునుగోడు ప్రజలు ఆశపడ్డారని, షా మాటలు వారిని నీరుగార్చాయన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులనీ, బీజేపీకి తప్పక మీటరు బిగిస్తరన్నారు. ఆ పార్టీకి ఇక్కడ డిపాజిట్ దక్కదని మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.