సూర్యాపేట: విద్యుత్ గరిష్ట డిమాండ్ (పీక్ డిమాండ్) వేళల్లో వాడిన కరెంటుకు 20 శాతం చార్జీలు పెంచాలంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముమ్మాటికి ఆర్థిక ద్రోహానికి పాల్పడటమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. చార్జీలు పెంచడం ద్వారా సామాన్యుడిని విద్యుత్ వినియోగం నుండి దూరం చెయ్యడమేనని కేంద్రంపై నిప్పులు చెరిగారు. పేదోడిపై పడే ఏ భారాన్ని అయినా ఒప్పుకునే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. ట్రూ అప్ చార్జీల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు నిదర్శనమన్నారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ట్రూ అప్ చార్జీలు పెంచాలి అంటూ ఈఆర్సీ సిఫారసు చేసినా పట్టించుకోకుండా రూ.12 వేల కోట్ల అదనపు భారాన్ని భరించైనా సామాన్యుడి మీద భారం పడకుండా చూసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కొనియాడారు.
పీక్ డిమాండ్ అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు, ఉదయం 5 నుంచి 10 గంటల వరకు విద్యుత్ను వినియోగించే వినియోగదారులపై భారం మోపుతామంటూ కేంద్రప్రభుత్వం తాఖీదులు జారీ చేస్తే భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంగా తాము సిద్ధంగా లేమని మంత్రి స్పష్టంచేశారు. పీక్ డిమాండ్లో 20 శాతం పెంచడమంటే గృహ వినియోగదారులతోపాటు పారిశ్రామికవేత్తలపై మోయలేని భారం మోపినట్లు అవుతుందన్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే దేశంలో విద్యుత్ కాంతులు ప్రసరింప జేస్తామంటూ ప్రగల్భాలు పలికిని మోదీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వినియోగం నుంచి సామాన్యుడిని దూరం చేసే కుట్రలకు తెర లేపారని విమర్శించారు. 2014కు ముందున్న ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయా, వ్యాపారం చేస్తున్నాయా అంటూ తులనాడి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్ వ్యాపారుల కోసమే తమ ప్రభుత్వం ఉందని నిరూపించారన్నారు.
జీవితంలో విద్యుత్ భాగమైందని, కరెంటును వినియోగించకుండా ఉండలేని పరిస్థితులు ఉత్పన్నమైనాయని చెప్పారు. అలాంటిపరిస్థితుల్లో పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు ఎత్తివేసే చర్యలకు బీజేపీ ప్రభుత్వం రూట్ మ్యాప్ రెడీ చేసిందని విమర్శించారు. తెలంగాణాలో పెట్టిన ప్రతీ కనెక్షన్కు మీటర్ పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ సిఫార్సులు తోసిరాజన్నందుకే ఇక్కడి ప్రభుత్వం ఫెర్ఫార్మెన్స్తో రావాల్సిన అప్పులను మోదీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. అందులో భాగంగానే ఎఫ్ఆర్బీఎంకి ఇచ్చే పరిమితుల్లో మోకాలొడ్డుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది పేదల పక్షంగానే ఉంటుందని స్పష్టం చేశారు.
పీక్ డిమాండ్ సమయంలో 20% చార్జీలు పెంచాలి అన్న కేంద్ర సిఫార్స్పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడిస్తారని ఆయన పేర్కొన్నారు. జేబులకు చిల్లులు పెట్టడం.. ప్రజలను చీకట్లోకి నెట్టడమే కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వ ఆలోచన అని ఎద్దేవాచేశారు. అటువంటి దుర్మార్గాలకు చెల్లుచీటి పడి మోదీ పాలనకు చరమ గీతంపాడే రోజులు ఎంతో దూరంలో లేవని మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.