నల్గొండ : ప్రధాని మోదీవన్నీ దొంగమాటలేనని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్ల రామారం గ్రామంలో నిర్మించిన వేర్ హౌసింగ్ గోదాములను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రోళ్లకి కేసీఆర్ అంటే గిట్టదు అని ప్రచారం చేసిన వాళ్లకు చెంప పెట్టులా.. మొదటిసారి ఏపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో నేతలు చేరారన్నారు.
ఆంధ్ర ప్రజలు కేసీఆర్ నాయకత్వం మాకు ఉంటే బాగుండు అనుకుంటున్నారన్నారు. భారత దేశంలో ఒక్క నిమిషం కూడా విద్యుత్ పోకుండా ఉన్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో తెలంగా ఉందన్నారు. 40వేల చెరువులను పునరుద్ధరించి నీటి ఊటగా మార్చిందన్నారు. బీఆర్ఎస్, కేసీఆర్ పరిపాలనలోనే సాధ్యమైందన్నారు. సీఎం కేసీఆర్ పనితీరును పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కితాబిచ్చారన్నారు.
25లక్షల మంది ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు సీఎం కేసీఆర్ ఉపాధి కల్పించారన్నారు. నల్లధనాన్ని వెనక్కి తీసుకువస్తామని, రూ.15లక్షల దేశ ప్రజలందరి ఖాతాల్లో వేస్తామని మోదీ గుర్తు చేశారు. అలాగే 2కోట్ల ఉద్యోగాలను ఇస్తామని చెప్పారని, నల్లం తిరిగి తీసుకురాలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు. గుజరాత్ను 25 సంవత్సరాలుగా బీజేపీ పాలిస్తుందని, అక్కడ ఉచిత కరెంటు, రూ.2వేల పెన్షన్ లేదన్నారు. కేసీఆర్ పేరంటేనే మోదీకి మంట అని, తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లలోకి నెట్టాలని ప్రధాని సహా కేంద్రమంత్రులు పని చేస్తున్నారని ఆరోపించారు.
గ్రామీణ ప్రాంతాల్లో చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేసుకునే స్థాయి తెలంగాణ వచ్చిందని మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కేవలం 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు లభిస్తున్నాయని, దీంతో ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా సేద్యం చేస్తూ జీవిస్తున్నారన్నారు. ఇంచు భూమి ఖాళీ లేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నీళ్లు, పెట్టుబడి ఇచ్చి రైతుకు అండగా నిలిచిన వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.వరి ఏపీలో 38లక్షల ఎకరాలు, తెలంగాణలో 68లక్షల ఎకరాల్లో సాగైందని తెలిపారు. రైతాంగాన్ని అభివృద్ధి చేస్తే ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి అన్నదాతలు చేరుకుంటారన్నారు.
ప్రధాని మోదీ రైతుల ఆదాయాన్ని 2022 వచ్చే నాటికి రెండింతలు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాని ఎన్నిక మేనిఫెస్టోలో పెట్టి చేయలేదనని విమర్శించారు. మోదీ తెలంగాణలో పోటీ చేస్తా అని అంటున్నారని, వచ్చి పోటీ చేస్తే ఓడించి ఇంటికి పంపుతామన్నారు. రాష్ట్రాల పొట్టగొట్టి నిధులు ఇవ్వకుండా మోదీ పైశాచికంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గాదరి కిశోర్, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్, జడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.