సూర్యాపేట: కాంగ్రెస్ (Congress) పార్టీకి ప్రజలు ఇప్పటికే నిరసన తెలియజేశారని, అందుకే ప్రతిపక్షంలో ఉన్నారని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) ఫైరయ్యారు. అయినా ఆ పార్టీ నాయకులు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోగా అవాస్తవాలు మాట్లాడుతూ యాత్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఏది అవాస్తవమని నిరసన చేస్తారని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. సూర్యాపేట (Suryapet) ‘దశాబ్ది దగా’ పేరుతో కాంగ్రెస్ చేపట్టబోయే నిరసనల అంశంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందటం అవాస్తవమని నిరసనా తెలుపుతారా అని నిలదీశారు. తమ ప్రభుత్వం వేసిన రోడ్ల మీద నడుస్తున్న ప్రతిపక్షాలు.. తామిస్తున్న మంచినీళ్లు తాగడం అవాస్తవమా అని మండిపడ్డారు.
ఫ్లోరిన్ (Fluoride) నీటి నుంచి విముక్తి చేయడం అవాస్తవమా అని విమర్శించారు. ఏ అభివృద్ధి జరగలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్దాలతో ప్రజలను నమ్మిస్తామని మూర్ఖపు భావనలో ప్రతిపక్షాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. చీకట్లో నడిచేవారు వెలుగును సృష్టించలేరని, వెలుగును చూడటం ఇష్టంలేని వారు ఎప్పటికీ చీకట్లోనే ఉండిపోతారన్నారు.