సూర్యాపేట: బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే రాష్ట్రంలో అలజడులు జరుగుతున్నాయని మంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. వైషమ్యాలు రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలోని నూతనకల్లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు, సస్పెన్షన్పై స్పందించారు.
తెలంగాణాలో బీజేపీ తన వికృతరూపం బయటపెడుతుందని ధ్వజమెత్తారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో శాంతిభద్రతల సమతుల్యం దెబ్బతిసి.. సీఎం కేసీఆర్ అభివృద్ధిని అడ్డుకునే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. చట్టబద్ధ సంస్థలు ఎలాంటి ఆరోపణలు చేయకున్నా బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేసి దాడులు చేస్తున్నారని వెల్లడించారు. కావాలనే రెచ్చగొట్టి, ప్రతిదాడులు చేయించుకుని శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాజా సింగ్ సస్పెన్షన్ ఒక డ్రామా అని, పథకం ప్రకారం మాట్లాడించి సస్పెన్షన్ చేసినట్లు నటిస్తున్నారని విమర్శించారు. బీజేపీ కుట్రల పట్ల ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. దాడులే లక్ష్యంగా చేసుకుంటే టీఆర్ఎస్ ముందు బీజేపీ ఎంతన్నారు.