హైదరాబాద్ : టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలను జగదీశ్ రెడ్డి తప్పుబట్టారు. తెలంగాణ భవన్లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడిన సందర్భంగా.. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. వారు పార్లమెంట్లో ముద్దు పెట్టుకున్నప్పుడే తెలిసిపోయింది కదా ఈ దేశ ప్రజలందరికీ. ఎవరి మధ్య ఎలాంటి సంబంధం ఉందో అని మంత్రి తెలిపారు. అందుకే కదా గుజరాత్కు వెళ్లనిది. గుజరాత్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. గుజరాత్కు వెళ్లకుండా ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు. ఎవరి మధ్య ఏం సంబంధాలు ఉన్నాయో.. ఈ దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అసలు రాహుల్ గాంధీ ఏ హోదాలో పాదయాత్ర చేస్తున్నారు? దేనికొరకు చేస్తున్నారు. పార్టీ నడపడం చేతకాదు అని అధ్యక్ష పదవి నుంచి పారిపోయిన వ్యక్తి.. పాదయాత్ర చేస్తున్నాడంటే అది జోకే కదా అని పేర్కొన్నారు. ఆయన మాటలు పరిగణనలోకి తీసుకోం అని జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు.