సూర్యాపేట : బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నిక ఉండదు.. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న రాజగోపాల్ కామెంట్స్పై మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు.
మునుగోడు ఉప ఎన్నికల సర్వేల్లో బీజేపీ మూడో స్థానంలో ఉందని పలు సర్వేసంస్థలు వెల్లడిస్తున్నాయని మంత్రి తెలిపారు. రాజీనామా అనంతరమే ఉప ఎన్నిక జరుగుతుందని చెప్పిన వారు.. ఇప్పుడు ఓటమి భయంతో వెనుకడుగు వేస్తున్నారని పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలపై బీజేపీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక్క నియోజకవర్గంలోనే ఎన్నికలు ఎదుర్కోలేని వాళ్ళు ముందస్తు గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. దేశం కోసం పని చేసే సైనికులను , రైతులను ఆదుకుంటే విమర్శించడం విపక్షాల హ్రాస్వ దృష్టికి నిదర్శనమని చెప్పారు. సరిహద్దులను కాపాడే సైనిక జవాన్ల త్యాగం గొప్పతనం గుర్తించలేని గొప్ప దేశ భక్తులు విపక్ష నాయకులు అని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు.