సూర్యాపేట : నిత్యం అధికారిక కార్యక్రమాలతో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బిజీగా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తుంటారు. ఎప్పటిలాగే తన అభిమాని కోరిన వెంటనే అభిమాని కోరిక మేరకు ఆటో నడిపి సందడి చేశారు. అదే ఆటోలో గృహలక్ష్మి లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి నూతన గృహానికి శంకుస్థాపన చేసి సొంతింటి కలను నెరవేర్చారు.
ఈ సంఘటన ఆదివారం సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం మున్యనాయక్ తండాలో చోటు చేసుకుంది. కాగా, గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయడంతో పాటు పలు గృహాలకు శంకుస్థాపన చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న అయన అభిమాని బానోతు రవి నాయక్.. తాను నూతనంగా కొనుగోలు చేసిన ఆటోను తన అభిమాన నేత జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించాలని కోరాడు. వెంటనే అభిమాని కోరికను మన్నించి ఆటోను నడిపారు. అలానే కిలోమీటర్ వరకు నడుపుకుంటూ గృహలక్ష్మి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నూతన గృహాలకు శంకుస్థాపన చేశారు. దీంతో అభిమాని ఆనందానికి అంతులేకుండా పోయింది.