సూర్యాపేట టౌన్, అక్టోబర్ 19: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో ఏ యాత్ర చేపట్టినా.. అది మధ్యలోనే ఆగింది తప్ప కొసెల్లలేదని, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేళ చేస్తున్న బస్సుయాత్ర కూడా తుస్సుమంటదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను మూలకు పడేసిన రాహుల్ గాంధీ.. కుటుంబ పాలన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఫైర్ అయ్యారు.
రాహుల్కు నాయకత్వ అర్హతలు లేవని, ఆయనకున్న ఏకైక అర్హత వారసత్వమేనని ఎద్దేవా చేశారు. కుంభకోణాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసని చెప్పారు. రాహుల్ గాంధీ మాటలు విని తెలంగాణ సమాజం నవ్వుకుంటున్నదని పేర్కొన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ఖర్చు లక్ష కోట్ల లోపే ఉందని, అలాంటిది లక్ష కోట్ల అవినీతి జరిగిందని రాహుల్ ఎలా అంటారని ప్రశ్నించారు. ఇంత అవినీతి జరిగితే కాంగ్రెస్ ఎందుకు ఫిర్యాదు చేయలేదని నిలదీశారు.
సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ సస్యశ్యామలమైందని కొనియాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యుడు ఒంటెద్దు నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.