సూర్యాపేట : గడిచిన తొమ్మిదేండ్లలో సూర్యాపేట జిల్లాలో రూ.34 వేల కోట్లతో సమగ్రాభివృద్ధి జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish reddy) పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల (Decade Celebrations) సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకు ముందు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవసాయం, విద్యుత్, విద్యా ,వైద్య రంగాలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వెల్లడించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నేతృత్వంలో రాష్ట్ర జీడీపీ 13.02 శాతానికి పెరిగిందన్నారు. కరోనా కుదుపు నుంచి అనతికాలంలోనే తెలంగాణ బయట పడి సుస్థిరంగా ముందుకు సాగుతుందని తెలిపారు.
2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధి రేటు 11.08 శాతంతో రికార్డ్ సృష్టించిందన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొందని స్పష్టం చేశారు. జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న నీటిపారుదల(Irrgation), ఆయకట్టుల అభివృద్ధికి రూ. 2,445.47 కోట్లు, విద్యుత్(Electricity) శాఖకు రూ.1,558.18 కోట్లు, మిషన్ భగీరథ కు రూ.1,216 కోట్లు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా రూ. 22.50 కోట్లు ఖర్చు పెట్టినట్లు ఆయన వెల్లడించారు.
రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం కేవలం 6 గురుకులాలు(Residential) ఉన్న సూర్యాపేట జిల్లాలో రాష్ట్రం ఏర్పాటు తరువాత 19 గురుకులాలు, రెండు డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. రాష్ట్రం ఆవిర్భావ అనంతరం పురపాలక సంఘాల అభివృద్ధికి రూ. 556.57 కోట్లు, పట్టణ పేదరిక నిర్ములనకు రూ.1456.20 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.6180.90 కోట్లను వెచ్చించినట్లు వివరించారు. అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం తో పాటు అధికారుల నిరంతర కృషి ఉందని ప్రశంసించారు.