సూర్యాపేట టౌన్, జూన్ 6: ‘తెలంగాణలో అలజడి సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నది. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర మంత్రులు ఇందుకు వ్యూహ రచన చేశారు. ఆకలి విషయాలు, అసలు సమస్యలు పక్కన పెట్టి దైనందిన కార్యక్రమాలను విస్మరించి.. మందిర్, మసీదు పేరుతో ప్రజల్లో చిచ్చు రగిల్చేందుకు ప్లాన్ వేస్తున్నారు’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేటలోని పలు వార్డుల్లో సోమవారం ఆయన అభివృద్ధి పనులను ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. అభివృద్ధిలో పల్లెలు, పట్టణాలు పోటీ పడుతూ దేశానికే ఆదర్శంగా తెలంగాణ మారుతుంటే.. తట్టుకోలేకనే కమలనాథులు కుట్రలకు తెరలేపారని విమర్శించారు.
ఎనిమిదేండ్ల పాలనలో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు బీజేపీ ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నదని మండిపడ్డారు. శ్రీలంకలా మారింది బీజేపీ పాలిత గుజరాత్, ఉత్తరప్రదేశ్లేనని, కేంద్రంలో మోదీ పాలన మరింత కాలం కొనసాగితే సోమాలియా పరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉన్నదని మంత్రి హెచ్చరించారు. ఆకలితో అలమటించే పాకిస్తాన్, బంగ్లాదేశ్ పక్కన భారతదేశాన్ని మోదీ నిలబెట్టారని విమర్శించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు బీజేపీకి నచ్చడం లేదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వాటిని అడుగుతారనే భయం వారిని వెంటాడుతున్నదని అన్నారు. అందుకే తెలంగాణ గొంతు నులిమేందుకు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి పార్టీకి వ్యతిరేకంగా తెలంగాణ నుంచే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక్కడ బీజేపీకి ఆదరణ అంతంత మాత్రమేనని, హస్తినలో ఆ పార్టీని గద్దె దింపేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని కోరారు.