విభజన హామీల అమలేదీ?
బీజేపీవి క్షుద్ర రాజకీయాలు
తల్లిని చంపినోళ్లే బిడ్డకు బర్త్డేలు చేస్తారా?
విద్యుత్తు మంత్రి జగదీశ్రెడ్డి
సూర్యాపేట, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఏర్పాటు సమయంలో మొట్టమొదటగా ద్రోహం చేసింది బీజేపీయేనని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. విభజన సమయంలో వచ్చిన ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపిందని, అటువంటి పార్టీ ఇప్పుడు సంబురాలు చేయడమేంటని ప్రశ్నించారు. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మే ప్రధాని మోదీ, ఆయన ఆప్త మిత్రుడు, కేంద్ర మంత్రి అమిత్షా ఆ ఉత్సవాల్లో పాల్గొనడం వెనుక కుట్ర ఉన్నదని దుయ్యబట్టారు. గురువారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బీజేపీ నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే.. ఎనిమిదేండ్లుగా ఆ పార్టీకి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. సంబురాలు చేయడమంటే మోదీ, అమిత్షా కలిసి ఆడుతున్న నాటకంగా అభివర్ణించారు. ఇటువంటి కొంగ జపాలకు తెలంగాణ ప్రజలు మోసపోరన్నారు. ఢిల్లీకి వస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినందుకే మైండ్ బ్లాక్ అయిన ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లో పెట్టుకున్నదని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అయినా విభజన హామీలు అమలు చేయలేదని విమర్శించారు.
క్షుద్ర రాజకీయాలకు పెట్టింది పేరైన బీజేపీ.. తెలంగాణ సంబురాలు చేస్తుందంటే తల్లిని చంపినోళ్లే బిడ్డకు బర్త్డే చేస్తున్నట్లు ఉన్నదన్నారు. నిరంకుశత్వంలో చైనాను మించిపోయిన బీజేపీదంతా వాట్సాప్ యూనివర్సిటీ మాయాజాలమని పేర్కొన్నారు. 2014కు ముందు తెలంగాణలో విద్యుత్తు కోసం ధర్నాలు, రాస్తారోకోలు, నీళ్ల కోసం మహిళలు ఖాళీ కుండలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించినట్లే.. ఇప్పుడు గుజరాత్లో జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రం లో అభివృద్ధిని అడ్డుకొనేందుకే బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక జీవోలను తెస్తున్నదని మండిపడ్డారు. ఆంక్షలతో అణచివేసే కుట్రలకు తెరలేపిన ఆ పార్టీ.. చెప్పేది జాతీయ వాదం చేసేది మాత్రం దేశద్రోహమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోనే రచ్చ జరుగుతుంటే ఇంకా రచ్చబండల ప్రసక్తి ఎందుకన్నారు. ఇక్కడి నాయకులవి పిల్ల చేష్టలని వ్యాఖ్యానించారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికాయుగేంధర్రావు, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ పాల్గొన్నారు.