విద్యుత్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏమిటని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. విద్యుత్ రంగం ఉమ్మడి జాబితాలోనిదని అయితే విద్యుత్ సంస్థలపై నిర్ణయం తీసుకునే అధికారం కేవలం రాష్ట్ర ప్రభుత్వలోనిదేనని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ విపణిలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న విద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు.
ఈ మేరకు మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరు పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం సాయంత్రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలు విదించాల్సి వస్తే దానికి ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ కొనుగోలు, అమ్మకాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కోర్టు నుండి స్పష్టమైన ఆదేశాలు పొందిందని, అయినా కోర్టు తీర్పును ఉల్లంఘించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని బీజేపీ ఈ తరహా కుట్రలకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. తద్వారా తెలంగాణ ప్రభుత్వం పేద, బడుగు, బలహీన, దళిత, గిరిజనులకు అందించే సబ్సిడీలు ఎత్తి వేయాలన్నదే బీజేపీ ఎజెండా అని ఆయన విమర్శించారు.
విద్యుత్ కొనుగోళ్లు అమ్మకాలు అన్నది పూర్తిగా ఆయా రాష్ట్రాల పరిధిలోనిదని, లేని అధికారంతో రాష్ట్రాలలో కేంద్రం జోక్యం చేసుకోవడం ఏందంటూ ఆయన విరుచుకుపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చి బకాయిల పేరుతో రాష్ట్రాల హక్కులను హరించేందుకే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రం చెప్పినట్లుగా తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కుడా బకాయి పడలేదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అంతే కాకుండా ఇది పూర్తిగా డిస్కంలకు సప్లై దారులకు మధ్య కుదిరే ఒప్పందం మాత్రమేనని ఆయన తెలిపారు. వారిద్దరి మధ్య తగవులు సంభవిస్తే పరిష్కరించేందుకు ఈఆర్సీలు లేదంటే కోర్టులు ఉన్నాయన్నారు.
2014కు ముందు, తరువాత విద్యుత్ సరఫరా పరిస్థితి ఏమిటన్నది తెలంగాణా ప్రజలకు సుస్పష్టంగా తెలుసు అని ఆయన చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల నుండే విద్యుత్ సరఫరాను మెరుగు పరచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. అనతి కాలంలోనే వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ను అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కిందన్నారు. జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి కేసీఆర్కు మంచి పేరు రావడం ఇష్టం లేకనే రాజకీయ ప్రేరేపిత నిర్ణయం తీసుకుందన్నారు.
యావత్ భారత దేశంలో 24 గంటల విద్యుత్ సరఫరా చేసే రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతి గడించినందునే కేంద్ర ప్రభుత్వం ఈ తరహా ఆటంకాలు కల్పిస్తుందన్నారు. మోడీ సొంత రాష్ట్రంలోనూ ఈ తరహా సరఫరా లేక పోవడంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కరెంట్ కోతలు ఉండడడంతో విసిగిపోయిన ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారోనన్న అనుమానంతోటే ఇటువంటి దుశ్చర్యలకు కేంద్రం పాల్పడుతోందన్నారు. పైగా ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత తోటి అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తల చూపు తెలంగాణ వైపు మళ్లడం కుడా కేంద్ర ప్రభుత్వ దుగ్ధకు ఒక కారణంగా కనిపిస్తుందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత చర్యతో రాష్ట్ర ప్రజల అభివృద్ధి కుంటు పడే ప్రమాదం ఉందని, అది అక్కడితో ఆగకుండా దేశాభివృద్ధికి నష్టం కలిగించే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి దేశద్రోహ పూరితమైన నిర్ణయం తీసుకున్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై న్యాయపరంగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.