సూర్యాపేట/మహబూబ్నగర్: సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) నామినేషన్ దాఖలు చేశారు. గురువారం ఉదయం సూర్యాపేట (Suryapet) పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. 2001లో రాజకీయ ప్రవేశం చేసిన జగదీశ్ రెడ్డి.. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అధికార ప్రతినిధి, పొలిట్బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి విద్యుత్ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.
మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) నామినేషన్ దాఖలు చేశారు. తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరిన మంత్రి.. పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈకార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా బాధ్యతలు చేపట్టి శ్రీనివాస్గౌడ్ కమిషనర్గా పదోన్నతి పొందారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2014 సంవత్సరంలో గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు మహబూబ్నగర్ స్థానం నుంచి పోటీ చేసి 3,139 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2019 సంవత్సరంలో 57,775 భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం ఎక్సైజ్, క్రీడా, పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు.