హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే విద్యుత్తు సవరణ బిల్లును వ్యతిరేకిస్తామని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. ఎంపీల ద్వారా ఈ బిల్లును అడ్డుకుంటామని చెప్పారు. శుక్రవారం నగరంలోని మంత్రుల క్వార్టర్స్లో తనను కలిసిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఫోరం (టీఎస్ఈఈఎఫ్) నేతలతో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యోగుల నిరంతర కృషి ఫలితంగా తెలంగాణలో విద్యుత్తు రంగం ముఖ్యభూమికను పోషిస్తున్నదని తెలిపారు. ఇలాంటి తరుణంలో సవరణ బిల్లు పేరిట కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదన్నారు. అయినా, ఎట్టిపరిస్థితుల్లోనూ అన్ని వర్గాలకు నిరంతర విద్యుత్తును అందించి తీరుతామని మంత్రి వెల్లడించారు.
అనంతరం, మంత్రి జగదీశ్రెడ్డికి టీఎస్ఈఈఎఫ్ నేతలు వినతిపత్రం అందజేశారు. 1999 నుంచి ఇప్పటివరకు నియమితులైన 18వేల ఉద్యోగులకు పాత పెన్షన్ను అమలు చేయాలని కోరారు. మంత్రి స్పందిస్తూ.. పాత పెన్షన్ అమలుపై విద్యుత్తు ఉన్నతాధికారులతో మాట్లాడి సాధ్యాసాధ్యాలను తెలుసుకుంటానన్నారు. పూర్తి వివరాలతో మరోమారు తనతో సమావేశం కావాలని టీఎస్ఈఈఎఫ్ నేతలకు సూచించారు. మంత్రిని కలిసిన వారిలో టీఎస్ఈఈఎఫ్ ప్రతినిధులు మల్లేశం, శ్రీనివాస్, సురేశ్, ప్రేమ్, సంజీవ్, చక్రవర్తి, విజయ్, ఉదయ్, కృష్ణ, ముత్తయ్య, ప్రవీణ్ ఉన్నారు.