సూర్యాపేట : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో వాతావరణ సమతుల్య ఏర్పడి, సకాలంలో వర్షాలు పడుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సూర్యాపేట నూతన సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కోటి వృక్షార్చనలో మంత్రి మొక్కను నాటారు.
ఆయన మాట్లాడుతూ హరితహారం (Haritha Haram) లో భాగంగా చేపట్టిన కోటి వృక్షార్చన అద్భుతమైనదని కొనియాడారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ (CM KCR) హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. హరితహారంతో రాష్ట్రంలో 7.7 శాతం గ్రీనరీ (Greenary) పెరిగిందన్నారు. సకాలంలో వర్షాలు పడుతుండటంతో ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉన్నారన్నారు.
తెలంగాణ ఏర్పాటుకుముందు చుక్క నీరు లేని పరిస్థితుల నుంచి నీరు ఇక చాలు అనే స్థాయికి వచ్చామంటే సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమయ్యిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ కు పాటుపడాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెనుమాల అన్నపూర్ణమ్మ, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, గుర్రం సత్యనారాయణరెడ్డి, మునిసిపల్ కోఆప్షన్ స్వరూప , మున్సిపల్ కమిషనర్ రామానుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.