సూర్యాపేట: పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ముఖ్యమంత్రి కేసీఆర్కు నివేదిక అందించిందని ఆయన చెప్పారు.
అందులో బాగంగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్యకు తెరదించే ప్రయత్నంలో భాగంగా ఏర్పాటైన ఉపసంఘానికి కొనసాగింపుగా కేసీఆర్ ఆదేశం మేరకు శనివారం రోజున ఆయా జిల్లాల కలెక్టర్లతో పాటు అదనపు కలెక్టర్లు, అటవీశాఖ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
అందులో బాగంగా శనివారం సాయంత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంప్ ఆఫీస్లో నల్లగొండ, సూర్యపేట, భోనగిరియదాద్రి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతోపాటు మూడు జిల్లాల అటవీశాఖ అధికారులతో మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పోడు భూములను సాగు చేసుకుంటున్న వారి వివరాలు పకడ్బందీగా సేకరించాలని ఆయన చెప్పారు.
ఆ దిశగా అటవీ, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో వ్యహరించాలని సూచించారు. సమగ్ర అధ్యయనం తర్వాత కేసీఆర్ తీసుకునే నిర్ణయం మేరకు అర్హులైన లబ్ధిదారులకు పోడు భూములపై హక్కులు కలిగించ నున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు వినయ్ కృష్ణారెడ్డి, ప్రశాంత్ జీవన్ పాటిల, పమేలా సత్పతి అదనపు కలెక్టర్లు మోహన్ రావు, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్లతో పాటు మూడు జిల్లాల అటవీశాఖ అధికారులు ముకుందరెడ్డి, రాంబాబు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.