సూర్యాపేట, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ) : మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో అన్నీ అబద్ధాలనే వల్లించాడని, ఆధార రహిత ఆరోపణలు మినహా మరోటి లేదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఎందుకు తేల్చలేక పోయావు మోదీ అని నిన్నటి అదే మునుగోడు సభలో సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్పలేదని జగదీశ్రెడ్డి నిలదీశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదన్న ప్రశ్నకు ప్రధాని మోదీ దగ్గరే సమాధానం లేదని.. ఇక అమిత్ షా దగ్గర సమాధానం ఉంటుందని తెలంగాణ సమాజం ఎంతమాత్రం భావించడం లేదన్నారు.
ఆదివారం మునుగోడు సభలో అమిత్ షా ప్రసంగంపై జగదీశ్రెడ్డి సూర్యాపేటలో ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ నోట్లో నోరు పెట్టి మాట్లాడినట్టు ఉన్నదని, అందులో కొత్తదనం ఏ మాత్రం కనిపించలేదని స్పష్టం చేశారు. ఆయన మాటల్లో పూర్తిగా దిగజారుడు తనం కనిపించిందని తెలిపారు. అమిత్షా ప్రసంగం కేంద్ర హోంమంత్రి స్థాయికి తగినట్టు లేదన్నారు. రాజకీయాలు, ఓట్లు, సీట్లు అధికారం తప్ప మరొకటి ఆయన మాటల్లో వినిపించలేదని చెప్పారు. మునుగోడు ప్రజల ఆశలపై నీళ్లు పోశారని మండిపడ్డారు. దేశాన్ని ఏలుతున్న పార్టీలో రెండో స్థాయి పెద్ద మనిషి వచ్చినప్పుడు తమగోడు విని వరాల జల్లులు కురిపిస్తారని అనుకొంటే అది వమ్ము అయిందన్న బాధ ప్రజల్లో కనిపించిందని ఆయన పేర్కొన్నారు. అంతిమంగా సీఎం కేసీఆర్ చెప్పిందే నిజమవుతుందని, మోటర్లకు మీటర్లు పెట్టాలన్నదే మోదీ ఎజెండా అని దుయ్యబట్టారు. మునుగోడు గడ్డమీద పుట్టిన బిడ్డలు చైతన్యవంతులని, బీజేపీకే ఇక్కడి ప్రజలు మోటర్లు బిగిస్తారని హెచ్చరించారు. వచ్చే ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టం చేశారు.